మాస్టర్, విక్రమ్,లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో లోకేష్ కనగరాజ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఎందుకోసం హఠాత్తుగా లోకేష్ మార్షిల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.
అలాగే లోకేష్ కనగరాజ్ నిర్మాతగా ‘బెంజ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ‘ఎల్సీయూ’ (LCU – లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) లో భాగంగా తెరకెక్కుతోంది. మరోవైపు శృతిహాసన్తో కలిసి ఓ పాటలో నటించి అందరిని ఆశ్చర్యపరిచిన లోకేష్, తాజాగా ఒక భారీ యాక్షన్ ఫిల్మ్తో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
ఈ యాక్షన్ ఫిల్మ్ను జీ స్క్వాడ్, ప్యాషన్ స్టూడియోస్, ద రూట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇందులో లీడ్ రోల్ పోషించబోతున్న లోకేష్, ప్రస్తుతం ఈ పాత్ర కోసం స్పెషల్గా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాడు.
ఖైది, విక్రమ్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో దక్షిణ భారతంలోనే అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందిన లోకేష్ కనగరాజ్ – తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం అతను రజినీకాంత్తో చేస్తున్న ‘కూలీ’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నంగా ఉన్నాడు. ఇక తర్వాతి సినిమాలు ‘ఖైదీ 2’ , ఆమీర్ ఖాన్తో చేయబోయే ఓ ప్రత్యేక చిత్రం. ఇవి కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు.
తాజాగా లోకేష్ హీరోగా చేస్తున్న సినిమాకు ‘కెప్టెన్ మిల్లర్’ ఫేం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా హీరోయిన్తో పాటు ఇతర తారాగణ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన లోకేష్ – ఇప్పుడు హీరోగా ఎలా కనిపిస్తాడో అన్న ఆసక్తి ఫ్యాన్స్లో ఊపందుకుంటోంది!